‘టీజీ సేఫ్’ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కృత్రిమ పనీర్పై నిషేధం విధించారు. పలు రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాల్లో దీని వాడకం విరివిగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. కల్తీ అవుతున్న ఘటనలు పెరగడంతో దీనిపై నిషేధం అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు ‘తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)’ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ రూపంలోనైనా నాన్-డెయిరీ పనీర్(అనలాగ్ పనీర్) తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ అమ్మకాలను వెంటనే నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిషేధం ఏడాదిపాటు అమల్లో ఉంటుంది. ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కృత్రిమ పనీర్పై అక్కడి ప్రభుత్వాలు నిషేధం విధించాయి. రాష్ట్రంలో గత ఆరు నెలలపాటు అధికారులు అధ్యయనం చేసి ఇటీవలే నివేదిక సమర్పించారు. చాలాచోట్ల గడువు తీరినా భద్రపరిచి విక్రయిస్తున్నట్లు, ప్రజల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటం ఆడుతున్నట్లు గుర్తించి వెంటనే దీన్ని నిషేధించారు.


