
Realme P4 Power 5G | ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో బిగ్ బ్యాటరీ ఫోన్లు ఎంట్రీ ఇస్తున్నాయి. గతేడాది నుంచి మొదలైన ఈ ట్రెండ్.. కొత్త ఏడాదిలోనూ కొనసాగనుంది. ప్రస్తుతం వన్ప్లస్ లాంచ్ చేసిన 15R దేశంలోనే అత్యధిక సామర్థ్యం (7400 ఎంఏహెచ్) కలిగిన స్మార్ట్ఫోన్గా ఉంది. మరికొన్ని కంపెనీలూ 6500-7300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేశాయి. ఇప్పుడు చైనాకు చెందిన రియల్మీ ఏకంగా 10వేల ఎంఏహెచ్ బ్యాటరీతో కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు రియల్మీ తన పీ4 పవర్ను లాంచ్ చేయనుంది. ఫ్లిప్కార్ట్ వేదికగా ఈ ఫోన్ను విక్రయించనున్నారు. దీంట్లో 10,001 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. సింగిల్ ఛార్జ్తో 32.5 గంటల వీడియో ప్లేబ్యాక్ పొందొచ్చని కంపెనీ పేర్కొంది. 144 Hz రిఫ్రెష్రేటుతో కూడిన 1.5k రిజల్యూషన్ డిస్ప్లేతో రాబోతోంది. ఈ ఫోన్కు సంబంధించిన ఇతర వివరాలు లాంచ్ సమయంలో వెల్లడి కానున్నాయి. ధర సుమారు రూ.35వేల పైనే ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బిగ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ను ‘గేమ్ఛేంజర్’గా అభివర్ణిస్తున్నారు. ఇతర కంపెనీలూ ఇదే బాట పడితే పవర్బ్యాంక్ల అవసరం ఉండబోదని పేర్కొంటున్నారు.


