
భారత్-జింబాబ్వే మధ్య టీ20 సిరీస్కు రంగం సిద్ధమైన వేళ, రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంచలన మ్యాచ్ చర్చనీయాంశంగా మారింది. ఆ మ్యాచ్లో జింబాబ్వే కేవలం 116 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొని చారిత్రక విజయం సాధించింది. పసికూన నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమిండియా ఛేదించలేపోవడం అభిమానులకు నేటికీ గుర్తుంది.
బిష్ణోయ్ మ్యాజిక్.. 115కే జింబాబ్వే ఆలౌట్
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన అనంతరం శుభ్మన్ గిల్ నాయకత్వంలోని యువ భారత జట్టు ఇప్పటిలాగే జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ముకేశ్ కుమార్ తొలి వికెట్ అందించగా, రవి బిష్ణోయ్ ( 4/13) తన అద్భుత స్పిన్తో జింబాబ్వే ఇన్నింగ్స్ను అతలాకుతలం చేశాడు. అతడికి వాషింగ్టన్ సుందర్ (2/11) కూడా తోడవ్వడంతో జింబాబ్వే 20 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది.
కుప్పకూలిన టీమిండియా
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుంచే తడబడింది. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ డకౌట్ కాగా, ఆ వెంటనే రుతురాజ్ గైక్వాడ్ కూడా పెవిలియన్ చేరాడు.
సికందర్ రజా, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత బ్యాటింగ్ను పూర్తిగా కుదిపేశారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్ (27) పోరాడే ప్రయత్నం చేసినా, మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. చివరకు భారత్ 102 పరుగులకే ఆలౌటై 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
టీమిండియాకు సవాల్
ఆ ఓటమి షాక్ నుంచి కోలుకోకముందే టీమిండియా మరోసారి జింబాబ్వేలో పర్యటిస్తుంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ సిరీస్లో భాగంగా ఇవాళ (జులై 23) తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది.
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్లపై టీ20 సిరీస్లు కోల్పోయి ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరిగే సిరీస్లో తప్పక విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, గత విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరో సంచలనం సృష్టించాలని జింబాబ్వే భావిస్తోంది.


