Oil prices: ‘చమురు’ షాక్‌.. ఆయిల్ కంపెనీలకు రూ.30వేల కోట్ల నష్టం


ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియా ఘర్షణలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి (Oil prices). ఫిబ్రవరి 28న ఇరాన్‌ యుద్ధం (Iran War) ప్రారంభం కావడానికి ముందు ఒక బ్యారెల్‌ ముడి చమురు ధర 70 డాలర్ల వద్ద ఉండగా.. ప్రస్తుతం 100 డాలర్లపైనే నడుస్తోంది. ఒక దశలో 144 డాలర్లకు కూడా చేరుకుంది. అయినా సరే దేశంలో చమురు ధరలు స్థిరంగానే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలకు రూ.30వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారిక వర్గాల వెల్లడించాయి.

పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం అయిన దగ్గరినుంచి ముడిసరకు ధర ఒక దశలో 50శాతం వరకు పెరిగినా.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్‌  పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (BPCL), హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (HPCL) ఇంధన సరఫరాను నిరంతరాయంగా కొనసాగించాయి. హర్మూజ్ అంతరాయాల వేళ ప్రజలు భయంతో కొనుగోళ్లు చేపట్టడంతో గిరాకీ భారీగా పెరిగి, సరఫరా వ్యవస్థలు ఒత్తిడికి గురైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కూడా ధరలు పెంచకపోవడంతో మార్చి మధ్య నుంచి ఈ మూడు కంపెనీలు (Indian oil companies) రూ.30వేల కోట్ల నష్టం చవిచూశాయి. వాస్తవంగా ఆ నష్టం రూ.62,500 కోట్లవరకు చేరేది. కానీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. దానివల్లే నష్టాలు తగ్గాయని ఆ వర్గాలు వెల్లడించాయి.

అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరకు అదనంగా మరికొన్ని ఖర్చులను భరించాల్సి వచ్చింది. రవాణా నౌకలను దారి మళ్లించడం, బీమా ప్రీమియాలు పెరగడం వంటి ఖర్చులు తోడయ్యాయి. ఈ చమురు షాక్‌ సమయంలో  వినియోగదారులపై భారం పడకూడదని, ఆర్థికపరమైన నిర్ణయాల్లో స్థిరత్వాన్ని కొనసాగించాలన్న నిర్ణయం కంపెనీల బ్యాలెన్స్ షీట్లపై ఒత్తిడి పెంచిందని తెలుస్తోంది. అయితే ఈ నష్టాలను ఇలాగే కొనసాగిస్తే.. కంపెనీలు భారీగా మూలధన రుణాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే సంక్షోభ సమయంలో పలు దేశాల్లో ధరలు పెంచగా.. భారత్ భిన్నమైన వైఖరిని అవలంబించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయంటూ గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. పెట్రోల్‌, డీజిల్‌ లీటరుకు రూ.25-28 మేర పెరగొచ్చంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటిని కేంద్రం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. 



Source link

Scroll to Top