వినియోగ గిరాకీకి సవాళ్లు ఎదురు కావొచ్చు


ఆర్థిక శాఖ నెలవారీ నివేదిక

దిల్లీ: సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఆర్థిక కార్యకలాపాలు మందగించే అవకాశం ఉందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో, వచ్చే నెలల్లో వినియోగ గిరాకీకి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఒక నివేదికలో తెలిపింది. దేశీయ మౌలిక అంశాలు స్థూలంగా చెక్కుచెదరకుండా ఉన్నాయని, తయారీ, సేవల రంగాల పీఎంఐలు వృద్ధి దశలో ఉన్నాయని వెల్లడించింది. కార్మిక విపణి స్థిరంగా ఉందని, బయటి అవాంతరాల నుంచి విదేశీ మారకపు నిల్వలు గణనీయమైన రక్షణను అందిస్తున్నాయని తాజా నెలవారీ ఆర్థిక సమీక్షలో మంత్రిత్వ శాఖ వివరించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ వాతావరణం సవాలుగా మారిందని తెలిపింది. పెరిగిన ముడి చమురు ధరలు, కఠినమవుతున్న ఆర్థిక పరిస్థితులు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో బలహీనపడుతున్న వృద్ధి వేగం వంటి ప్రతికూలతల నుంచి భారత్‌ పూర్తిగా బయటపడలేదని పేర్కొంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు పశ్చిమాసియా సంఘర్షణ ఒక పెద్ద విఘాతంగా పరిణమించిందని వెల్లడించింది. దీని ప్రభావం ఇంధన మార్కెట్లు, సరఫరా వ్యవస్థలు, వాణిజ్య మార్గాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై అంతకంతకూ స్పష్టంగా కనిపిస్తుందని వివరించింది.



Source link

Scroll to Top