
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన పోలీసు బాస్, డీజీపీ సీవీ ఆనంద్ ఖమ్మం నగరంలో మంగళవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సంబంధించి కొన్ని అంశాలపై ఉన్నతాధికారి దృష్టి సారించి పరిష్కారానికి దారులు వేయాలని నగర వాసులు, జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.
- ఖమ్మం నగరంలో కొన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో నేరాల సంఖ్య అధికంగా ఉంటోంది. జనాభా, విస్తృతి పెరిగిపోయింది. ఆయా స్టేషన్ల పరిధిని విభజించి నూతనంగా మరో స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ డిమాండ్ ఎప్పటినుంచో నానుతోంది.
- కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది.. సివిల్ వివాదాల్లో జోక్యం చోటుచేసుకుంటున్నారని, స్థిరాస్తి, ఫైనాన్స్ వంటి కేసులను సెటిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. తీవ్ర ఘటనలు జరిగినప్పుడు కేసు తీవ్రతను తగ్గించేందుకు యత్నిస్తున్నారన్న అపవాదుఉంది.
- నగరం, మున్సిపాలిటీల్లోని ప్రధాన రహదారుల్లోనే సీసీ కెమేరాల నిర్వహణ సక్రమంగా లేదు. దీంతో నేరాలు, చోరీలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారుతోంది. బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- గంజాయి ఏదో రూపంలో జిల్లా సరిహద్దుల నుంచి లోనికి చేరుతూ విచ్చలవిడిగా విక్రయమవుతోంది. దీని మత్తులో యువత నగరంలో అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. రాత్రివేళ పెట్రోలింగ్ అస్తవ్యస్తంగా మారింది. పెట్రోలింగ్ వాహనాల సంఖ్య, సిబ్బందిని పెంచాల్సి ఉంది.
- జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లలో కొందరు సిబ్బంది పాతుకుపోయారు. దీర్ఘకాలంగా వీరు ఒకేచోట పనిచేస్తున్నారు. బదిలీ అంటే చాలు సర్వశక్తులూ ఒడ్డి స్థానిక వేరే పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు తప్పితే బయటకు అడుగు పెట్టడం లేదు. దీంతో దూరప్రాంతాల్లో, ఇతర జిల్లాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆశావహులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
- నగరంలో ఇటీవల చోటుచేసుకున్న రెండు భారీ చోరీలు కలకలం సృష్టించాయి. రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైన ఈ చోరీల సొత్తు నేటికీ రికవరీ కాలేదు. ప్రధాన రహదారిపై పోలీసు స్టేషన్కు కూతవేటు దూరంలో అర్ధరాత్రి షట్టర్ తెరిచి రూ.67లక్షల విలువైన సెల్ఫోన్లు అపహరించినా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేకపోవడం గమనార్హం. ఠాణాల మధ్య సమన్వయలేమికి దర్పణం పడుతోంది ఈ ఉదంతం.


